పెరిగిన ఇళ్ల విక్రయాలు.. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు

6 Apr, 2022 14:34 IST|Sakshi

కరోనా తగ్గడంతో తిరిగి ఊపందుకున్న కొనుగోళ్లు

ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల స్టాంప్‌ డ్యూటీ ఆదాయం  

సాక్షి, ముంబై: కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా సడలించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక్క మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో అంటే 15,700 ఆస్తులు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి స్టాంప్‌ డ్యూటీ రూపంలో రూ.1,084 కోట్ల ఆదాయం వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్చిలో రికార్డు స్ధాయిలో రెవెన్యూ వచ్చింది. ఫిబ్రవరితో పోల్చి చూస్తే మార్చిలో 51 శాతం ఆదాయం ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా మార్చిలో ప్రతీరోజూ సగటున 507 ఆస్తులు కొనుగోలు జరిగినట్లు స్టాంపు డ్యూటీ కార్యాలయంలో నమోదైన రిజిస్టేషన్లను బట్టి తెలిసింది. కొనుగోలు చేసిన ఇళ్లలోనూ అధిక శాతం రూ.కోటి నుంచి ఐదు కోట్ల వరకు విలువచేసే (అంటే 500 చదరపు అడుగుల నుంచి వేయి చదరపు అడుగుల వరకు) ఇళ్లు కొనుగోలు చేశారు.  

కరోనాతో కొనుగోళ్ల పతనం... 
కరోనా మొదటి, రెండో దఫా ప్రభావం భవన నిర్మాణ రంగాలపై తీవ్రంగా చూపింది. కానీ మూడో దఫాలో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసింది. దీంతో అస్తవ్యస్తమైన జనజీవనం గాడిన పడింది. పరిస్థితులు సర్దుకోవడంతో ఇళ్ల విక్రయాలు, కోనుగోళ్లు జోరందుకున్నాయి. ముంబైకర్లు గృహ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, ఫ్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా బుక్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మొదటి దఫాలో ఆర్థికంగా దెబ్బతిన్న బిల్డర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం స్టాంపు డ్యూటీలో రాయితీ కల్పించింది. దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఫలితంగా బిల్డర్ల ఆర్ధిక వ్యవస్ధకు నవసంజీవని లభించినట్లయింది.  

మరిన్ని వార్తలు