సేన సర్కార్‌ @ 365

28 Nov, 2020 08:03 IST|Sakshi

ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలకడైన పాలన 

సీఎంగా అందరినీ కలుపుకొని పోతున్న ఉద్ధవ్‌ 

శివసైనికుడు సీఎం కావడంతో బాల్‌ ఠాక్రే కల సాకారం 

సమస్యలను ధీటుగా ఎదుర్కొంటున్న మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం 

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్‌ అఘాడి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా పదవీ స్వీకారం చేసి కూడా ఏడాదవుతోంది. ఈ సంవత్సర కాలంగా మహావికాస్‌ ప్రభుత్వాన్ని కూల్చా లని బీజేపీ ఎన్ని ప్రయ త్నాలు చేస్తున్నా, ఉద్ధవ్‌ మాత్రం తన సీటును బాగానే కాపాడుకుంటున్నారని మరాఠా రాజకీయాలను గమనిస్తూ ఉండే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కూటమిలోని మూడు పార్టీల మధ్య అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేకున్నా ఇన్నాళ్లు సమస్యలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే అది ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ల మధ్య ఉన్న అవగాహన అనుకోవచ్చు.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీతో విబేధించిన ఉద్ధవ్‌.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీతో వ్యవహరించే విషయంలో మాత్రం తన తండ్రి దివంగత బాల్‌ ఠాక్రే పోరాట లక్షణాలను అందిపుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం ఎప్పటికైనా శివసైనికుడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలన్న బాల్‌ ఠాక్రే కలను సాకారం చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ, ఎన్నికల ఫలితాల తదనంతర పరిస్థితుల నేపథ్యంలో సీఎం పీఠం ఎక్కే ఆ శివసైనికుడు తానే అయ్యారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం సాయంతో 80 గంటల స్వల్ప కాలం పాటు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినా, తర్వాత తమకు సరిపడా మద్దతు లేదని పేర్కొంటూ దిగిపోయింది. తదనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో మహావికాస్‌ అఘాడి కూటమిని ఏర్పాటు చేసిన శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో, గతేడాది నవంబర్‌ 28న సీఎంగా పదవీ స్వీకారం చేసిన ఉద్ధవ్‌ నేటితో సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్నారు.   

రూ.38 వేల కోట్ల పంట రుణాల మాఫీ.. 
రాష్ట్రంలోని 40 లక్షల మంది రైతులకు రూ.38 వేల కోట్ల పంట రుణాల మాఫీ, ఆరే మెట్రో కార్‌ షెడ్‌ను అక్కడనుంచి తొలగించి కంజూర్‌మార్గ్‌కు తరలించడం వంటి వి మహావికాస్‌ ప్రభు త్వం తీసుకున్న కొన్ని పెద్ద నిర్ణయాలు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రతిష్టాత్మకంగా భావిం చిన నాగ్‌పూర్‌–ముంబై సమృద్ధి కారిడార్‌కు బాల్‌ ఠాక్రే పేరు పెట్టడమే కాకుండా, జల్‌యుక్త్‌ శివ ర్‌ జల సంరక్షణ పథకంపై విచారణకు ఆదేశిం చడం కూడా మహావికాస్‌ ప్రభుత్వం తీసుకున్న మేజర్‌ నిర్ణయాలే. తానొక్కడే కాకుండా సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అందరిని పాలనలో భాగం చేస్తార ని మహావికాస్‌ ప్రభు త్వంలోని ఓ మంత్రి చెప్పారు. పాల్ఘర్‌లో ఇద్ద రు సాధువులపై మూక హత్య, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు వంటివి రాజకీయంగా పెను దుమారం లేపాయి. అక్టోబర్‌లో సీబీఐకి రాష్ట్రంలో జనరల్‌ కన్సెంట్‌ నిరాకరించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విచారించాలన్నా, ప్రతీ కేసు కేసుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ ప్రభుత్వం నిలకడగా తమ ప్రయాణాన్ని సాగించిందని విశ్లేషకుల అభిప్రాయం.   చదవండి: (స్టీరింగ్‌ నా చేతిలోనే ఉంది..)

పాలన నల్లేరు మీద నడకలా సాగలేదు..  
గతేడాది ఉద్ధవ్‌ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఆయన పాలన నల్లేరు మీద నడకలా మాత్రం సాగలేదు. ఎందుకంటే ఈ ఏడాది మార్చి ముందు వరకు నిసర్గ తుపాన్, తూర్పు విదర్భ, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రలో వరదల వంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ తర్వాత ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి విజృంభించింది. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రం గా మహారాష్ట్ర నిలిచింది. రాష్ట్రం లో కరోనా కేసులు 18 లక్షలకు చేరువ అవుతుండగా, 47 వేల మందిని పొట్టన పెట్టుకుంది. అంతేగాక ఉద్ధవ్‌ ఇంటి నుంచే పాలన సాగిస్తారనే విమర్శ కూడా ఉంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కూడా ఉద్ధవ్‌ను, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ఇరికించే ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు.   

మరిన్ని వార్తలు