నా ఇంటిపై రెక్కీ: మాలిక్‌

28 Nov, 2021 06:20 IST|Sakshi

ముంబై: ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ), సంస్థ ఉన్నతాధికారి సమీర్‌ వాంఖెడేలపై కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఈసారి కొత్త ఆరోపణలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు. ‘ గత వారం నేను దుబాయ్‌లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ నిర్వహించారు.

కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్‌ చాట్స్‌ నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని నవాబ్‌ మాలిక్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు