సాక్షి, న్యూఢిల్లీ : తజకిస్తాన్లో శుక్రవారం రాత్రి సంభవించిన భూప్రకంపనలు ఉత్తర భారత్ను వణికించాయి. జమ్మూ కశ్మీర్తో పాటు రాజధాని ఢిల్లీలోనూ పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలతో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం రోడ్ల మీదకు పరుగులు తీశారు. కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం భూప్రకంపనలపై స్పందించారు. రాత్రి సమయంలో తాను ఓ వీడియో కాల్ మాట్లాతుండగా.. తన గది మొత్తం ఒక్కసారిగా ఊగిపోయిందని తెలిపారు.
యూనివర్సిటీ ఆఫ్ చికాగో విద్యార్థులతో మాట్లాతున్న సమయంలో తన రూం అంతా ఊగిపోయిందని రాహుల్ పేర్కొన్నారు. వెంటనే రూంలో నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. కాగా తజకిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు కాగా.. ఢిల్లీలో 4.2గా నమోదైంది. మొదట పంజాబ్లోని అమృత్సర్కి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అధికారులు భావించారు. అయితే భూ ప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
My interaction with Prof Dipesh Chakrabarty & students of The University of Chicago, Institute of Politics. https://t.co/5OgHVuQEhB
— Rahul Gandhi (@RahulGandhi) February 12, 2021