టైరు మార్చిన కలెక్టర్‌ రోహిణి, వైరల్‌

27 Feb, 2021 13:34 IST|Sakshi

మైసూరు: కలెక్టర్‌ అంటే సమాజంలో గొప్ప హోదా. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా తక్షణమే అందుబాటులోకి వస్తాయి. ఆ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకొని వార్తల్లో నిలిచారు కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి. తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి సింధూరి తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం కొడగు తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారును డ్రైవ్‌ చేశారు. మార్గంమధ్యలో టైర్‌ పంక్చర్‌ అయ్యింది.

ఆమె స్వయంగా రంగంలోకి దిగి, కారు కింద జాకీ అమర్చి టైర్‌ను ఊడదీసి, మరో టైర్‌ను అమర్చారు. రోడ్డుపై వెళ్లేవారు గమనించి మీరు మైసూరు జిల్లా కలెక్టర్‌ కదా! అని అడగ్గా అవును తానే రోహిణి సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా శుక్రవారం వైరల్‌ అయ్యాయి. కలెక్టర్‌ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్‌ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు