ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్‌..?

18 Oct, 2021 09:02 IST|Sakshi

లక్నో: పారి, పిహు, విధి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. కలిసిమెలసి ఉండేవారు. ఆడుతూపాడుతూ.. అమ్మానాన్నతో కలిసి సంతోషంగా జీవించేవారు. జింకపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే చిన్నారులు.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. చిన్నారుల మృతి వారి తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్తులను కూడా కలచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు..

ఉత్తరప్రదేశ్‌, బరేలీకి చెందిన నవీన్‌ కుమార్‌ సింగ్‌కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజులు క్రితం వరకు కూడా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఈ అమ్మాయిలు బిస్కెట్లు, చిప్స్‌ కొనుక్కుని తిన్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. 
(చదవండి: వైరల్‌: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!)

ఇది గమనించిన చిన్నారుల తండ్రి నవీన్‌ కుమార్‌ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి మృతి చెందింది. చిన్నారులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతి గురించి పోలీసులకు తెలియడంతో వారు.. సంఘటన స్థలానికి చేరుకుని.. అంత్యక్రియలు ఆపేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం ఇదే!)

ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరిక్షలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీసులు చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్‌ అధికారులు బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్‌ శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.  

చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు

మరిన్ని వార్తలు