సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలి

11 Nov, 2020 05:05 IST|Sakshi

ఎస్సీవో సభ్యదేశాల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/బీజింగ్‌/మాస్కో: భారత్‌తో తరచూ పేచీలకు దిగుతున్న చైనా, పాకిస్తాన్‌లకు ప్రధాని మోదీ మరోసారి చురకలు అంటించారు. మరొక దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని హితవు పలికారు. ఆయన మంగళవారం షాంఘై కో–ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 8 మంది సభ్యులున్న ఎస్సీవో సదస్సును కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు విషయంలో భారత్‌–చైనా ఘర్షణ తర్వాత మోదీ, జిన్‌పింగ్‌ ఆన్‌లైన్‌లో ముఖాముఖి ఎదురుపడడం ఇదే తొలిసారి. ఎస్సీవో వ్యవస్థాపక ఉద్దేశాలను విస్మరిస్తూ ద్వైపాక్షిక అంశాలను ఈ వేదికపై ప్రస్తావించడం సరైందికాదని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్‌ గతంలో కశ్మీర్‌ అంశాన్ని ఎస్సీవో సదస్సులో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్‌ తీరును మోదీ తప్పుపట్టారు. కాగా, సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం మరింత పెరగాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సూచించారు. కరోనా వైరస్‌ నివారణ కోసం రష్యా అభివృద్ధి రెండు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, అవి సురక్షితమేనని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. మరో వ్యాక్సిన్‌ కూడా త్వరలో రానుందని తెలిపారు. ఎస్సీవోలో ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు