యూపీ బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
లక్నో : యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లతో యుద్ధం ఎప్పుడు చేయాలో నిశ్చయించుకున్నారని అన్నారు. ఆదివారం సికందర్ పూర్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేవ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రామ మందిర్, ఆర్టికల్ 370 విషయంలో తీసుకున్నట్లుగానే పాకిస్తాన్, చైనాలతో ఎప్పుడు యుద్ధం చేయాలో మోదీ నిర్ణయించుకున్నారు. సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ కార్యకర్తలు టెర్రరిస్టుల’’ని పేర్కొన్నారు. ( ఆర్బీఐ గవర్నర్కు కరోనా పాజిటివ్ )
భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో దేవ్ సింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆదివారం ఆయుధ పూజ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదానికి స్వప్తి పలకాలని ఆయన ఆకాంక్షించారు. శాంతి నెలకొల్పడమే తమ ఉద్ధేశ్యమని, ఈ విషయంలో తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కాగా, పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని పెంచడానికే దేవ్ సింగ్ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ రవీంద్ర కుశ్వాహ అనటం గమనార్హం.