ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ

15 Aug, 2020 07:59 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ :  ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి  ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ' రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం. ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కృషి చేస్తున్నారు. కరోనా వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నా.కరోనా ఒక్కటే కాదు.. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చాయి.  కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ తెలిపారు.' అంటూ మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు.

ఆత్మనిర్భర్‌ భారత్ మనందరి సంకల్పం కావాలి :
'75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణత్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్ర్యం తెచ్చారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మనందరి సంకల్పం కావాలి.ఆధునిక కావాల్సిన వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్‌ భారత్‌. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన రైతులు నిరూపించి చూపారు. భారత్‌ను ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు. మన రైతులే స్ఫూర్తిగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ సాధిద్దాం. భారత్ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. మన శక్తిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి. 


చైనా వస్తువులను నిషేధిద్దాం : 
'చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇతర దేశాల వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపిద్దాం. ఒక నాడు భారత వస్తువులు అంటే ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది.  మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. కరోనా కష్టకాలంలో కూడా మనం కొత్తదారులు వెతుక్కుందాం. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్క్‌లు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం. భారత్‌లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టాం.' అంటూ పేర్కొన్నారు.


నేషనల్‌ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం :
నేటి నుంచి నేషనల్‌ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించనున్నాం.ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు. కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం. మూడు వ్యాక్సిన్లు తుది పరీక్షల దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఇతర దేశాల వస్తువులను పూర్తిగా నిషేధించాలి. మన ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పిద్దాం. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తీసుకొద్దాం. మేకిన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలి. దేశ వ్యాప్తంగా 22 కోట్ల మంది మహిళలకు జన్‌థన్‌ ఖాతాలు ఉన్నాయి. మహిళల వివాహ వయస్సుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఒకే కార్డు.. ఒకే దేశం లాంటి పథకాలు తీసుకొచ్చాం. 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లో మహిళలకు హక్కులు లభించాయి. సరిహద్దులు దాటేవారికి సైన్యం గుణపాఠం నేర్పింది. దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఒకటే సమాధానం 'అంటూ మోదీ ప్రసంగించారు.



కాగా ఎర్ర‌కోట వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి కావ‌డం విశేషం. కరోనా నేపథ్యంలో 150 మందిని మాత్రమే వేడుకలకు అనుమతించారు. ఈ సందర్భంగా అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఇక‌, ప్రతి ఒక్కరూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల్సిందే.. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు.
 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు