మత్స్య సంపద వృద్ధికి పీఎంఎంఎస్‌వై

11 Sep, 2020 06:03 IST|Sakshi

రూ.20 వేల కోట్లతో ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా ప్రధాని మోదీ గురువారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఈ–గోపాల యాప్, బిహార్‌లో మరికొన్ని పథకాలను ప్రారంభించారు.  ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశ స్వావలంబనకు వీలవుతుందని చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులను రెట్టింపు చేస్తూ..అదనంగా 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 2024–25 కల్లా ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల ఆదాయం సాధించమే లక్ష్యం. 2020–21 నుంచి 2024–25 వరకు అమలయ్యే ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా పీఎంఎంఎస్‌వైను రూ.20,050 కోట్లతో అమలు చేస్తారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా మత్స్య శాఖను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఫిషరీస్‌తోపాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా రైతులు, ఉత్పత్తి దారుల ఆదాయం పెంచుతామన్నారు. ఈ–గోపాలæ యాప్‌లో పశుపోషణ, ఆరోగ్యం, దాణా, ఉత్పాదకత వంటి అంశాలపై సమస్త సమాచారం ఉంటుందన్నారు. ఈ–గోపాల్‌ను యానిమల్‌ ఆధార్‌కు అనుసంధానం చేస్తామన్నారు. 50 కోట్లకు పైగా పశువులకు ఫుడ్‌ అండ్‌ మౌత్, బ్రుసెల్లోసిస్‌ వంటి వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకా వేసే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు