‘కరోనాపై విజయానికి ఆ రాష్ట్రాలే కీలకం’

11 Aug, 2020 15:45 IST|Sakshi

కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: పది రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయగల్గితే.. భారత్‌ కోవిడ్‌ని జయించగలుగుతుంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు. అన్‌లాక్‌3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. (ఢిల్లీలో కరోనా కేసులు తగ్గాయి అయితే..)

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మనం 10 రాష్ట్రాల్లో కరోనాను ఓడిస్తే.. దేశం కోవిడ్‌పై విజయం సాధించగలుగుతుంది. ఇందుకుగాను బిహార్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కరోనాపై పోరులో నియంత్రణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిఘా అనే ఆయుధాలు అత్యంత ప్రభావవంతంగా పని చేశాయి. 72 గంటల్లోపు కోవిడ్‌-19 కేసులను గుర్తిస్తే.. వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు కంట్రోల్‌ చేయవచ్చని నిపుణులు అంచాన వేస్తున్నారు’ అని మోదీ ఈ సమావేశంలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక తరఫున ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు.(స్కూల్స్‌ ఓపెన్‌ చేస్తారా ఇప్పుడేలా?!)

మహారాష్ట్రలో అత్యధికంగా కోవిడ్-19 కేసులు ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు 22.68 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం వరకూ రికవరీ రేటు 69.79 శాతంగా ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ ఐదు రాష్ట్రాలు గత 24 గంటల్లో అత్యధిక కరోనా వైరస్‌ కేసులు, మరణాలను నమోదు చేశాయి. (100కు ఫోన్‌ చేసి ప్రధానికి బెదిరింపు)

వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సహాయక చర్యలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని ఆరోగ్య జాగ్రత్తలను ప్రజలు పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. 

మరిన్ని వార్తలు