దేశవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ఉత్సవ్

11 Apr, 2021 10:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. దీంతో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈనెల 11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ‘టీకా ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్నారు. దేశంలో అర్హులైనవారిలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో 45 ఏళ్లు పైబడినవారు టీకా వేయించుకోవాలనే విషయమై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించిన విషయం తెలిసిందే. దీంతో ‘టీకా ఉత్సవ్‌’లో అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ పలు రాష్ట్రాలు ప్రజలను కోరాయి.

మరోవైపు దేశంలో కేవలం 85 రోజుల్లో 10 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రి  హర్షవర్దన్‌  తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్‌ చేరిందన్నారు. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి యూకేలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పట్టిందని గుర్తుచేశారు. మొత్తం డోసుల్లో 60.62 శాతం 8 రాష్ట్రాల్లోనే (మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ) వేసినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా డిమాండ్‌కి తగ్గట్టుగా కోవిడ్‌ టీకాల పంపిణీ లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు వ్యాక్సినేషన్‌ కేంద్రాల నుంచి వెనుతిరుగుతున్నారు. టీకాల కొరత వల్ల మహారాష్ట్రలో ఇప్పటికే పలు వ్యాక్సిన్‌ కేంద్రాలను మూసివేశారు. మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉంది. 

చదవండి: వామ్మో రెండు లక్షల కేసులు

చదవండి: కరోనా:‌ వ్యాక్సిన్‌ భారతం లెక్కలివే..

మరిన్ని వార్తలు