జైలులో కాంగ్రెస్‌ నేత సిద్ధూ.. చేయాల్సిన పని, వసతులు ఇవే..

21 May, 2022 10:58 IST|Sakshi

పంజాబ్‌ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మ‌ధ్యాహ్నం పాటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో న‌మోదైన ఓ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అనంతరం త‌క్షణ‌మే కోర్టు ముందు లొంగిపోవాల‌ని కూడా సిద్ధూకు స‌ర్వోన్నత న్యాయ‌స్థానం సూచించింది. దీంతో ఆయనకు రూల్స్ ప్రకారం.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతిలో నొప్పి వచ్చినట్లు అనిపించడంతో సిద్ధూను మాతా కౌస‌ల్య ఆస్పత్రికి తీసుకెళ్లి పోలీసులు చికిత్స ఇప్పించారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. సిద్ధూ జైలులో ఏడాది పాటు ఎలాంటి జీవితం గడపనున్నారు అనే విషయంపై జైలు అధికారులు స్పష్టతనిచ్చారు. సిద్ధూకు జైలు అధికారులు ప్రత్యేక మర్యాదలు చేశారు. సిద్ధూకు ఖైదీ నంబర్ 241383ను అలాట్‌ చేస్తూ.. బ్యారక్ నంబర్ 7ను సిద్ధూకు కేటాయించారు. జైలులో సిద్ధూకు ఓ టేబుల్, రెండు టర్బన్లు, నాలుగు జతల కుర్తా పైజామా, బ్లాంకెట్, రెండు టవల్స్, ఓ కప్ బోర్డు, దోమ తెర, ఓ పెన్ను, నోట్ బుక్, షూలు, రెండు బెడ్ షీట్స్ అందించారు. ఇక, సిద్ధూ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని జైలు అధికారులు తెలిపారు. జైలు మాన్యువల్ ప్రకారం సిద్ధూకు శుక్రవారం రాత్రి 7.15 గంటలకు పప్పు, రోటీ ఇచ్చినట్లు సమాచారం. 

ఖైదీల రోజువారీ జీవితం ఇలా ఉంటుంది.. 
- ఉదయం 5:30 గంటలకు ఖైదీలు నిద్రలేస్తారు.
- ఉదయం 7 గంటలకు వారికి టీతో పాటు బిస్కెట్లు లేదా శనగలు(chickpeas) అందిస్తారు.
- ఉదయం 8:30 గంటలకు బ్రంచ్ (6 చపాతీలు, పప్పు/వెజ్జీలు) అనంతరం పనికి వెళ్లాలి. 
- సాయంత్రం 5:30 గంటలకు ఖైదీలు కేటగిరీ ప్రకారం కేటాయించిన పనిని పూర్తి చేస్తారు.
- సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం (ఆరు చపాతీలు, పప్పు/వెజ్జీలు).
- రాత్రి 7గంటలకు ఖైదీలను వారి బ్యారక్‌ల లోపలకి వెళ్తారు. 

ఇక, ఖైదీలకు రోజువారీ పనికిగానూ రూ. 30-90 సంపాదిస్తారు. మొదటి మూడు నెలలు వారికి వేతనాలు లేకుండా శిక్షణ ఇస్తారు. నైపుణ్యం లేని, సెమీ-స్కిల్డ్ లేదా నైపుణ్యం కలిగిన ఖైదీగా వర్గీకరించబడిన తర్వాత వారు ప్రతిరోజూ రూ. 30-90 సంపాదిస్తారు. శిక్ష పడిన నేరస్థులు రోజుకు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని 10 రోజులు గడిపిన కూతురు

మరిన్ని వార్తలు