Covishield: ఈయూ పాస్‌పోర్ట్‌లో కోవిషీల్డ్‌ను చేర్చేలా చూడండి! 

29 Jun, 2021 12:34 IST|Sakshi

న్యూఢిల్లీ: యూరోపియన్‌ యూనియన్‌ ‘కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ పాస్‌పోర్ట్‌’లో కోవిషీల్డ్‌ టీకాను కూడా చేర్చే విషయంలో జోక్యం చేసుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. కోవిషీల్డ్‌ను అందులో చేర్చనట్లయితే ఆయా దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, వ్యాపారులు సమస్యలను ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. 

ఇప్పటి వరకు 4 టీకాలకు మాత్రమే యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఆమోదం లభించింది. అవి ఫైజర్‌/బయోఎన్‌టెక్, మోడెర్నా, వాక్స్‌జెర్విరియా(ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌), జాన్సన్‌. ఈ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే ఈయూ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. భారత్‌లో ఎక్కువమంది తీసుకున్న కోవిషీల్డ్‌ను ఈయూ వ్యాక్సినేషన్‌ పాస్‌పోర్ట్‌లో చేర్చనట్లయితే, అనేక విపరిణామాలుంటాయని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు రాసిన లేఖలో ఎస్‌ఐఐ సీఈఓ ఆధర్‌ పూనావాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్‌లో 30 కోట్లమంది కోవిషీల్డ్‌ తీసుకున్నారని, మొత్తంగా 50% భారత జనాభా ఈ టీకానే తీసుకునే అవకాశముందని తెలిపారు.

ఇక్కడ చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్‌
Prashant Bhushan: వ్యాక్సిన్‌ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్‌

>
మరిన్ని వార్తలు