కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందా ?

21 May, 2021 12:49 IST|Sakshi

కర్నాటకలో చిన్నారులను కమ్మేస్తున్న కరోనా

బెంగళూరు: కర్నాటకలో కరోనా కల్లోలం రేపుతోంది.  దేశంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన రీతిలో ఇక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  పెద్ద, మధ్య వయస్కులు,యువకుల్లో కాకుండా అక్కడ పదేళ్ల లోపు పిల్లల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కరోనా కొత్త మ్యూటెంట్లు ఏమైనా వచ్చాయా ? థర్డ్‌ వేవ్‌ ప్రమాద ఘంటికలు  కర్నాటక నుంచి వెలువుడుతున్నాయా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

లాక్‌డౌన్‌ విధించి రెండు వారాలు దాటినా కర్నాటకలో కరోనా కంట్రోల్‌ కావడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత కర్నాటకలో చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. మార్చి నుంచి మే వరకు 9 ఏళ్లలోపు వారిలో ఏకంగా 39, 846మంది కరోనా బారిన పడగా...10 నుంచి 19 ఏళ్ల కేటగిరీలో అయితే రికార్డు స్థాయిలో1,05,044 మందికి కరోనా సోకింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. గతేడాది  దేశంలో కరోనా తొలి కేసు మొదలైనప్పటి నుంచి 2021 మార్చి వరకు కరోనా కేసులు నమోదైన తీరును పరిశీలిస్తే  9 ఏళ్లలోపు 27, 841 కేసులు ఉండగా 10 నుంచి 19 ఏళ్ల లోపు వారు 65,551గా నమోదైంది. 

అంటే  స్వల్ప వ్యవధిలోనే చిన్నారుల్లో 145 శాతం అధికంగా  టీనేజ్‌ పిల్లల్లో 160 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. మరణాల్లోనూ  ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. గతేడాది నుంచి మార్చి వరకు  9  ఏళ్ల లోపు వారు  28 మంది చనిపోగా కేవలం ఈ రెండు నెలల్లోనే ఇప్పటికే 15 మందికి పైగా కోవిడ్‌ బారిన పడ్డారు. టీనేజ్‌పిల్లల దగ్గరికి వచ్చే సరికి మరణాల సంఖ్య46 నుంచి 62 కి చేరుకుంది. ఇంట్లో కరోనా సోకిన పెద్ద వాళ్లకు ప్రైమరీ కాంటాక్టుగా పిల్లలు ఉండటం వల్లనే చిన్న పిల్లలు కరోనా బారిన పడుతున్నారనే వాదనలు ఉన్నాయి.

ఫస్ట్‌వేవ్‌లో పెద్ద వయసువారు, సెకండ్‌ వేవ్‌లో యువత కరోనా బారిన పడ్డారు. థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది.  చిన్నారులు కరోనా బారిన పడటానికి కారణం ఇండియన్‌ స్ట్రెయినా, సింగపూర్‌ స్ట్రెయినా అనే వాదనలు కొనసాగుతుండగానే కర్నాటకలో చిన్నారుల్లో పెరుగుతున్నకేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పద్దేనిమిదేళ్లు దాటిన వారికే ప్రస్తుతం టీకాలు ఇచ్చే పరిస్థితి దేశంలో కనిపించడం లేదు. ఇప్పుడు 18 ఏళ్లలోపు ఏజ్‌ గ్రూప్‌లోనూ కేసులు పెరగడం కలవరం కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు