మహిళల పట్ల సున్నితత్వంతో మెలగాలి: రాష్ట్రపతి ముర్ము

13 Mar, 2023 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళల ప ట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసా రం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలని మన రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. నవభారత్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆల్‌ వుమెన్‌ బైక్‌ ర్యాలీను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపారు.

‘మహిళలను గురించి ప్రతి పౌరుడు గౌరవప్రదంగా ఆలోచించాలి. మహిళల పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తనకు పునాది కుటుంబమే. తల్లులు, సోదరీమణులు తమ కొడుకులు, సోదరుల్లో మహిళలకు గౌరవం ఇచ్చే విలువలను పెంపొందించాలి. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని, సున్నితత్వంగా మెలిగే సంస్కృతిని ఉపాధ్యాయులు పెంపొందించాలి’అని ద్రౌపదీ ముర్ము కోరారు. ‘మహిళల్లో మాతృత్వ సామర్ధ్యం, నాయకత్వ సామర్ధ్యం సహజంగానే ఉంటాయి. అనేక పరిమితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మహిళలు తమ అసమానమైన ధైర్యం, నైపుణ్యాలతో కొత్త విజయ రికార్డులను నెలకొల్పారు’అని ఆమె పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

మరిన్ని వార్తలు