ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే: సుప్రీంకోర్టు

20 Jan, 2022 11:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. కాగా ఇటీవల నీట్ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు వెలువరించింది.

కాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను అమలు చేయరాదని, ఈ కారణంగా నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌  జాప్యమవుతుండటాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు.
చదవండి: 'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'

మరోవైపు ప్రస్తుత కౌన్సిలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడి భవిష్యత్తు రిజర్వేషన్ల అర్హతలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ కేసు తుది విచారణ మార్చి చివరి వారంలో చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. 
చదవండి: Corona: ఒక్కరోజే 3 లక్షల కేసులు..8 నెలల తర్వాత తొలిసారి..

మరిన్ని వార్తలు