ఈ ఏడాది పాత పద్ధతిలోనే నీట్‌ ఎస్‌ఎస్‌ పరీక్షలు

7 Oct, 2021 06:22 IST|Sakshi

న్యూఢిల్లీ: వైద్య విద్యలో స్పెషలైజేషన్‌ కోర్సుల కోసం ఉద్దేశించిన నీట్‌ సూపర్‌ స్పెషాలటీ పరీక్షలు ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే జరుగుతాయని సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2022–23 విద్యా సంవత్సరం నుంచి మార్పుల్ని అమలు చేస్తామని వెల్లడించింది.  కేంద్ర నిర్ణయాన్ని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి బుధవారం సుప్రీం బెంచ్‌కి తెలిపారు. ‘పాత విధానంలో పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ మెడికల్‌ కమిషన్, జాతీయ పరీక్షల బోర్డుతో సంప్రదించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది’ అని ఆమె తెలిపారు.

నవంబర్‌ 13–14 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షల్ని వాయిదా వేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఈ ఏడాది నుంచే నీట్‌ పరీక్షలో మార్పులుంటాయని నోటిఫికేషన్‌ వెలువడ్డాక  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 41 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ డాక్టర్లు, ఇతర వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టుకెక్కడంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం వారి పిటిషన్లు విచారించింది. కేంద్రం తీరుపై సుప్రీం బెంచ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సిలబస్‌ మార్చడం ఏమిటని కేంద్రాన్ని నిలదీసింది.

మరిన్ని వార్తలు