భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా ఎన్‌ఈపీ: మోదీ 

26 Feb, 2023 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: యువత సామర్థ్యం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్య, నైపుణ్యాలకు నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) కొత్త రూపమిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఏళ్లుగా విద్యావిధానంలో సరళత లోపించడంతో ఈ రంగంలో స్తబ్దత ఆవరించిందని చెప్పారు.

ఎన్‌ఈపీలో విద్య, నైపుణ్యాలకు సమాన ప్రాముఖ్యత లభించిందన్నారు. దీనివల్ల విద్యార్థులకు ప్రతిబంధకాలుగా మారిన గత నిబంధనలను తొలగించి విద్యారంగంలో మరిన్ని సంస్కరణలను చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుందని ప్రధాని చెప్పారు. విద్య, నైపుణ్యాలతో యువశక్తిని సంసిద్ధులను చేయడం అంశంపై శనివారం జరిగిన బడ్జెట్‌ అనంతర వెబినార్‌నుద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘మన ఉపాధ్యాయుల పాత్ర ఇకపై కేవలం తరగతి గదులకే పరిమితం కారాదు. దేశవ్యాప్తంగా ఉన్న మన విద్యా సంస్థలకు మరిన్ని రకాల బోధనోపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. వీటివల్ల గ్రామాలు, నగరాల్లోని పాఠశాలల మధ్య అంతరాన్ని తగ్గించే అనేక అవకాశాలు ఉపాధ్యాయులకు చేరువలో రానున్నాయి’అని ప్రధాని మోదీ చెప్పారు.  

మరిన్ని వార్తలు