కంగన ఎఫెక్ట్‌: గాంధీజీపై నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

17 Nov, 2021 14:11 IST|Sakshi

నేతాజీ, గాంధీజీ మధ్య సత్సంబంధాలు లేవు

మా నాన్నకు గాంధీ అంటే చాలా ఇష్టం

సంచలన వ్యాఖ్యలు చేసిన నేతాజీ కుమార్తె

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ) స్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు, గాంధీజీకి మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావు. కానీ మా నాన్నకు గాంధీజీ అంటే చాలా అభిమానం’’ అన్నారు. ఉన్నట్లుండి నేతాజీ కుమార్తె.. తన తండ్రి గురించి, గాంధీజీ గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. ఆ వివరాలు..

స్వాతంత్య్రం గురించి వివాదం రాజేసి.. అది సద్దుమణగకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కంగన. గాంధీజీ, నెహ్రూ ఇద్దరు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక చరిత్ర ప్రకారం చూసుకున్న గాంధీజీ, నేతాజీకి మధ్య సిద్ధాంతపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. 
(చదవండి: మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?)

ఈ క్రమంలో తాజాగా కంగన వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనిత బోస్‌ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కంగన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘‘మా నాన్నకు, గాంధీ గారికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. మరోవైపు మా నాన్నకు గాంధీ గారంటే చాలా ఇష్టం’’ అని తెలిపారు. 

‘‘వారిద్దరు గొప్ప నాయకులు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఒకరు లేకుండా ఒకరిని ఊహించుకోలేం. వారిద్దరిది గొప్ప కలయిక. కేవలం అహింసా సిద్ధాంతం వల్ల మాత్రమే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది అంటూ చాలాకాలం నుంచి కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్‌ఏ పోషించిన పాత్ర మనందరికి తెలుసు’’ అన్నారు అనితా బోస్‌. 
(చదవండి: మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్‌)

‘‘అలానే కేవలం నేతాజీ, ఐఎన్‌ఏ వల్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చింది అనే ప్రచారం వ్యర్థం. గాంధీజీ మా నాన్నతో సహా ఎందరికో ప్రేరణగా నిలిచారు. స్వాతంత్య్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివితక్కువతనం’’ అంటూ పరోక్షంగా కంగనకు చురకలు వేశారు అనితా బోస్‌.

చదవండి: బేలాబోస్‌: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్‌!

మరిన్ని వార్తలు