కరోనా నిర్ధారణకు మరో కొత్త పరికరం

18 Sep, 2020 17:42 IST|Sakshi

లండన్‌ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ సోకిందా లేదా నిర్ధారించేందుకు మరో పరికరం ప్రపంచ మార్కెట్‌లోకి వస్తోంది.  ఈ పరికరం ద్వారా ‘కోవిడ్‌ నడ్జ్‌ టెస్ట్‌’ను నిర్వహిస్తారు. మూడు గంటల్లోనే కోవిడ్‌ సోకిందా లేదా అనే విషయాన్ని ఈ పరికరం తేల్చి చెబుతోందని, 94 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ‘కోవిడ్‌–టెస్ట్‌’ పరికరాలు 70 శాతమే కచ్చితమైన ఫలితాలనిస్తుండగా ఈ కొత్త పరికరం 94 శాతం కచ్చితమైన ఫలితాలనివ్వడం విశేషమని వారు చెబుతున్నారు. 

బూట్ల డబ్బా అంత ఉండే ఈ పరికరంలో క్యార్టిడ్జెస్‌ను ఉపయోగిస్తారు. అనుమానితుల ముక్కు నుంచి తీసీ స్లేష్మం, నోటి లాలాజలం నుంచి తీసుకునే శాంపిల్స్‌ను ఈ క్యార్టిడ్జ్‌పై పరికరంలోకి పంపించగా, అది వాటిని మూడు గంటల్లోగా విశ్లేషించి ఫలితాన్నిస్తుంది. దాదాపు 30 పౌండ్లు అంటే దాదాపు 2,900 రూపాయలుండే ‘కోవిడ్‌ నడ్జ్‌టెస్ట్‌ బాక్స్‌’లను లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన స్పినౌట్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఐదు వేల పరికరాలు, 58 లక్షల క్యార్టిడ్జ్‌ల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు బ్రిటన్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ( ఏపీలో ఒక్కరోజే 74,710 కోవిడ్‌ పరీక్షలు )

ప్రధానంగా విద్యా సంస్థలు, థియేటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు వీటి కోసం ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఇంటి వద్ద పరీక్షలకు కూడా ఇవి ఎంతోగానో ఉపయోగ పడతాయని ఎన్‌హెచ్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. సంగీత కచేరీలకు కూడా ఇవి బాగా ఉపయోగ పడుతున్నాయట. ఇటీవల లండన్‌లో జరిగిన సింఫని ఆర్కెస్ట్రా కచేరీలో కళాకారులందరికి ఈ పరికరాల ద్వారా కరోనా లేదని నిర్ధారించాకే లోపలికి అనుమతించారు.

మరిన్ని వార్తలు