బెంగళూరు కేంద్రంగా కరోనాకు మరో వ్యాక్సిన్‌!

23 May, 2021 19:52 IST|Sakshi

మాలిక్యూల్‌ కనుగొన్న ఇండియన్‌ ఇన్స్‌స్టిట్యూ్‌ ఆఫ్‌ సైన్స్‌ 

బెంగళూరులో జరుగుతున్న ప్రయోగాలు

బెంగళూరు: గది ఉష్ణోగ్రత వద్ద పని చేసే తొలి కరోనా వ్యాక్సిన్‌ ఇండియాలో రూపు దిద్దుకుంటోంది. ఇండియన్‌ ఇన్స్‌స్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌) ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. బెంగళూరు వేదికగా ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రయోగ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఐఐఎస్‌ చెబుతోంది. 

ఎలుకల్లో ప్రయోగాలు
ఐఐఎస్‌ బెంగళూరులో మాలిక్యూలర్‌ బయో ఫిజిక్స్‌ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు విరుగుడుగా పని చేసే మాలిక్యూల్‌ని కనుగొన్నారు. ఈ మాలిక్యూల్‌తో ఎలుకల్లో ప్రయోగాలు జరపగా యాంటీబాడీస్‌ పెరిగినట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కంటే ఎనిమిదిరెట్లు అధికంగా యాంటీబాడీలు ఎలుకల్లో తయారయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మనుషుల్లో త్వరలోనే ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

గది ఉష్ణోగ్రత వద్ద
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు అన్నీ శీతల ఉష్ణోగ్రతల్లోనే పని చేసేవిగా తయారయ్యాయి. కరోనాకు తొలి వ్యాక్సిన్‌గా వచ్చిన ఫైజర్‌ అయితే ఏకంగా మైనస్‌ 71 సెల్సియస్‌ డిగ్రీల దగ్గర నిల్వ చేయాల్సి ఉంది. ఇక కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వీలు 8 సెల్సియస్‌ డిగ్రీలు ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. దీంతో వ్యాక్సిన్ల నిల్వ, సరఫరా ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతోంది. కానీ ఐఐఎస్‌ బెంగళూరు రూపొందించిన వ్యాక్సిన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద కూడా బాగా పని చేస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ సులువు అవుతుందంటున్నారు సైంటిస్టులు.

మరిన్ని వార్తలు