యమున నది తీరాన భారీగా మంటలు 

24 Feb, 2021 20:09 IST|Sakshi

న్యూఢిల్లీ: యమున నది తీరాన.. మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో కార్చిచ్చుగా భావించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక వాహనాలు తీవ్రంగా శ్రమించాయి.

యమున నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ సమీపంలోనే మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ ఉంది. ఈ మంట వ్యాప్తితో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే దట్టమైన పొగలు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందే కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పొగ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నది ఒడ్డున మంటలు ఎలా వచ్చాయనేది ఇంకా తెలియడం లేదు. దీనిపై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ మంటలు వ్యాపించిన ప్రాంతానికి సమీపంలోనే ఇందిరా గాంధీ స్టేడియం, రాజ్‌ఘాట్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఉంది.
 

మరిన్ని వార్తలు