వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం

24 Nov, 2021 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ రద్దను బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్‌ లాస్‌ రిపీల్‌ బిల్‌ 2021 టు రిపీల్‌ త్రీ ఫామ్‌ లాస్‌’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్‌ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 

గత వారం, ప్రధాన మంత్రి  మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసన తెలుపుతున్న రైతులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో,  మూడు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు వేచి ఉంటారని రైతు నాయకుడు రాకేష్ టికైత్ అన్నారు.

అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం మరో నాలుగు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు పంపిణీ చేశారు. దీన్ని మరో నాలుగు నెలలు పొడిగించారు. గడిచిన 15 నెలల కాలానికి గాను ఈ పథకానికి కేంద్రం 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. 

చదవండి: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు

మరిన్ని వార్తలు