ఢిల్లీలో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 13,527
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రికవరీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండగా, పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం 1,45,000 దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1300 కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య 1,45,427కు చేరింది. కొత్తగా 1225 మంది వైరస్ను జయించి డిశ్చార్జి అవగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,30,587కు చేరుకుంది. మొత్తంగా 4,111 మంది మరణించారు. (కరోనాతో 196 మంది వైద్యులు మృతి)
10,279 యాక్టివ్ కేసులుండగా, హోం ఐసోలేషన్లోనే 5,462 కేసులున్నాయి. కరోనా ఉధృతి దృష్ట్యా ఢిల్లీలో 472 కంటైన్మెంట్ జోన్లున్నాయి. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 13,527 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా ఢిల్లీలో నేడు 5,702 ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, 18,085 ర్యాపిడ్ పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 11,92,082కు చేరుకుంది. ప్రతి పది లక్షల జనాభాకు 62,741 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. (రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు)