Mountain Of Garbage: చెత్త దిబ్బల వద్ద షూటింగ్‌.. అయితే పైసలు కట్టాల్సిందే!

26 Sep, 2021 18:33 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా చెత్త అంటే వ్యర్థపదార్థంగానూ, లేక పెద్దగా ఉపయోగపడని వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఓ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాత్రం వ్యర్థాలు ద్వారా కూడా పైసలు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త దిబ్బల వద్ద వీడియోలు, షూటింగ్‌ తీసే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయాలని తూర్పు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయం ప్రకారం.. వీరి పరిధిలో ఎక్కడైనా చెత్త దిబ్బల వద్ద వెబ్ సిరీస్, ఇతర షూటింగ్‌ల చేయాలనుకునే వారు ప్రతిరోజూ రూ.75,000 చెల్లించాలని మేయర్‌ శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. దీంతో పాటు ల్యాండ్‌ఫిల్ సైట్ సమీపంలో షూటింగ్ కోసం రూ. 2 లక్షలు చెల్లించాలని తెలిపారు. అంతే కాకుండా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.25,000 చెల్లించాలని, వాటిని 2 వారాల్లో తిరిగి ఇస్తామన్నారు.

అయితే, ఈ ఛార్జీలపై ఓ వెసులుబాటును కూడా కల్పించారు. ఎవరైనా పేరుకుపోతున్న చెత్త, వాటి తొలగింపు సమస్యపై డాక్యుమెంటరీ తీసినా లేదా సామాజిక సందేశాన్ని అందించేందుకు షూటింగ్‌ చేసేవారి నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. కాకపోతే అందుకోసం తమకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

చదవండి: కిల్లర్‌ చైర్‌.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

మరిన్ని వార్తలు