కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్‌ కవర్‌ సంస్కృతి?: సుప్రీం కోర్టు

21 Mar, 2023 10:30 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల వన్‌ ర్యాంక్, వన్‌ పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) తాలూకు రూ.28,000 కోట్ల బకాయిలను వచ్చే ఫిబ్రవరికల్లా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై గతేడాది తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు పి.ఎస్‌.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది.

ఓఆర్‌ఓపీ బకాయిలపై భారీ మాజీ సైనికోద్యోగుల ఉద్యమం (ఐఈఎస్‌ఎం) పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. బకాయిల చెల్లింపునకు కాలావధిని ఖరారు చేసింది. దీనిపై కేంద్రం సీల్డ్‌ కవర్లో సమర్పించిన నోట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సంస్కృతి సముచిత న్యాయ ప్రక్రియకు విరుద్ధమని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి తెర పడాలన్నారు. ‘‘వ్యక్తిగతంగా కూడా సీల్డ్‌ కవర్లకు నేను వ్యతిరేకిని. కోర్టులో పారదర్శకత చాలా ముఖ్యం. అంతిమంగా ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. అందులో రహస్యమేముంటుంది?’’ అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు