డ్రగ్‌ వినియోగంపై డీఆర్‌డీఓ మార్గదర్శకాలు

1 Jun, 2021 12:17 IST|Sakshi
డీఆర్‌డీఓ రూపొందించిన 2 డీజీ డ్రగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ నిరోధానికి డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరెవరికీ డ్రగ్‌ వేయాలి.. వేయకూడదో స్పష్టం చెప్పింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించినట్టు గుర్తు చేసింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని సూచించింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చు అని పేర్కొంది.

అయితే ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ, శ్వాసకోస, హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలు ఉన్నవారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించలేదని, అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అని డీఆర్‌డీఓ సూచించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదు అని డీఆర్‌డీఓ స్పష్టంగా పేర్కొంది.

రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించవచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరాకు విజ్ఞప్తి చేయవచ్చు. డీఆర్‌డీఓ రూపొందించిన 2-డీజీ సాచెట్‌ ధరను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో 2డీజీ సాచెట్‌ ధర రూ.990గా రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్‌లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది.

చదవండి: మార్కెట్‌లోకి 2-డీజీ డ్రగ్ విడుదల
చదవండి: 2-డీజీ సాచెట్‌ ధర ప్రకటించిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌

మరిన్ని వార్తలు