పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆధార్ లింక్ చేయండి?

31 May, 2021 16:45 IST|Sakshi

ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు అలర్ట్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనలు జూన్ 1, 2021 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. ఉద్యోగుల ఖాతాలను ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, ​​యజమానులకు అప్పగించింది.

ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇకనుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది.

కొత్త నియమం ఏమిటి?
సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి, పీఎఫ్ ఖాతా ఆధార్‌తో లింకు చేయకపోతే లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో ధృవీకరించబడకపోతే, ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) దాఖలు చేయబడదు. అంటే, ఉద్యోగులు తమ సొంత పీఎఫ్ ఖాతాలో సంస్థ యజమాని జమ చేసే వాటాను ఇక నుంచి పొందలేరు. జూన్ 1లోగా తమ ఉద్యోగుల ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసి ధృవీకరించాలని ఈపీఎఫ్‌ఓ యజమానులందరినీ ఆదేశించింది. ఈ కొత్త నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా?
దశ 1: అధికారిక ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్( www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
దశ 2: ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లి యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి
దశ 3: యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
దశ 4: మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను పొందుతారు. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 5: మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్‌లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది.

చదవండి: రూ.50 వేలు దాటేసిన బంగారం ధర

మరిన్ని వార్తలు