పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్‌: రెండు ప్రాణాలు బలి

27 Apr, 2021 17:58 IST|Sakshi

న్యూఢిల్లీ: పెరోల్‌ మీద విడుదల అయిన ఓ రౌడీ షీటర్‌ కాల్పులకు పాల్పడ్డాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తన భార్యతో పాటు మరొకరిని దారుణంగా తుపాకీతో కాల్చి హత్య చేశాడు.ఈ ఘటనలో ఓ నిండు గర్భిణి, యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని దక్షిణ నిజాముద్దీన్‌ ప్రాంతానికి చెందిన డ్రగ్‌ డీలర్‌ షరాఫత్‌ షేక జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందట పెరోల్‌పై విడుదల అయ్యాడు. వచ్చి రాగానే తన భార్య ఎక్కడుందో ఆచూకీ తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లాడు

ఈ క్రమంలో మంగళవారం భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు షెరాఫత్‌. బయట కూర్చున్న భార్య షైనాతో కొద్దిసేపు మాట్లాడి ఆ వెంటనే తనతో తెచ్చుకున్న తుపాకీతో మొదట కాల్చాడు. అయితే పక్కన ఉన్న ఆమె సహాయకుడు వెంటనే షఫత్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో షఫత్‌ అతడిపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం భార్యపై మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయేదాక తుపాకీతో పేలుస్తూనే ఉన్నాడు.

అడ్డుకోబోయిన వారిని తుపాకీతో బెదిరించాడు. తుపాకీ తూటాలకు బలయిన భార్య షైనా నిండు గర్భిణి. ఇంత కర్కషంగా.. విచక్షణా రహితంగా గర్భిణి అయిన తన భార్యను హతమార్చడం కలకలం రేపింది. అయితే కాపాడేందుకు వచ్చిన వారంతా ప్రాణభయంతో వెనక్కి తిరిగారు. వారిద్దరినీ కాల్చిన అనంతరం దర్జాగా అతడు వెళ్లిపోయాడు. ఇదంతా ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం?
చదవండి: ‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌
 

మరిన్ని వార్తలు