భర్త సంసారానికి పనికి రాడనీ..

7 Dec, 2020 08:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోర్టు మెట్లెక్కిన భార్య

భర్తకు వైద్య పరీక్షలు

కరోనా భయంతో సంసారానికి భర్త దూరం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా కష్టాలు పడ్డారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ గురించి ప్రజలు ఎంతలా భయపడ్డారో తెలిపే ఉదాహరణ ఒకటి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు తన భార్య దగ్గరికి వెళ్లేందుకు సైతం భయపడ్డాడు. దీంతో ఆ యువతి తన భర్త సంసారానికి పనికి రాడనీ, భరణం ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. ఈ వింత కేసు భోపాల్‌ లా ట్రిబ్యునల్‌ (లీగల్‌ అథారిటీ) ముందుకు రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ జంటకు ఈ ఏడాది జూన్‌ 29వ తేదీన వివాహమైంది. అప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు ఉధృతంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడు కరోనా సోకుతుందనే భయంతో భార్య దగ్గరికి వెళ్లేందుకు జంకాడు. దాదాపు మూడు నెలల పాటు అత్తవారింట్లోనే ఉన్న ఆ యువతి తీవ్ర వేదనతో పుట్టింటికి వెళ్లిపోయింది.

రెండు నెలలపాటు అక్కడే గడిపి భరణం కావాలంటూ డిసెంబర్‌ 2వ తేదీన భోపాల్‌ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. పెళ్లయిన ఈ 5 నెలల్లో అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. భర్త ఫోన్‌లో బాగా మాట్లాడేవాడని, దగ్గరకు మాత్రం రాలేదని తెలిపింది. న్యాయాధికారుల కౌన్సెలింగ్‌లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా ఫోబియా కారణంగానే ఆ యువకుడు దాంపత్య విధిని నెరవేర్చలేదని తేలింది. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి, అంతా సరిగ్గా ఉందని ధ్రువీకరించారు. కౌన్సెలింగ్‌ అనంతరం ఆ యువతి భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లిందని భోపాల్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి సందీప్‌ శర్మ తెలిపారు.  (చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు)

మరిన్ని వార్తలు