పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్‌.. వరుడికి ఫోన్‌ చేసి..!

23 Oct, 2022 16:12 IST|Sakshi

లక్నో: వివాహం జరిగిన మరుసటి రోజునే వరుడికి షాక్‌ ఇచ్చింది ఓ నవ వధువు. ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలతో పరారైంది. ఆ తర్వాత వరుడికి ఫోన్‌ చేసి తన కోసం వేచి చూడొద్దని తెగేసి చెప్పేసింది. ‘నేను నిన్ను ప్రేమించలేదు. నున్వు నాకు ఫోన్‌ చేయొద్దు’ అని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువులను పట్టుకెళ్లిన క్రమంలో పోలీసులను ఆశ్రయించాడు వరుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన అక్టోబర్‌ 4నే జరిగినా.. బిల్హార్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం వరుడు ఫిర్యాదు చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జదేపూర్‌ గ్రామానికి చెందిన అరవింద్‌ను తాత్కౌలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి కుదిర్చుతామని నమ్మించారు. అందుకు తమకు రూ.70వేలు ఇవ్వాలి డిమాండ్‌ చేశారు. డబ్బులు తీసుకున్నాక అరవింద్‌ను బిహార్‌ తీసుకెళ్లి రుచి అనే యువతితో పెళ్లి కుదిర్చారు. సెప్టెంబర్‌ 30న హోటల్‌కు తీసుకెళ్లి పెళ్లి కూతురి ఫోటో చూపించారు. అక్టోబర్‌ 1న గయాలోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అరవింద్‌. అక్టోబర్‌ 4న తెల్లవారి నిద్రలేచే సరికి అతని భార్య కనిపించలేదు. ఇంట్లో ఉంచిన రూ.30వేల నగదు, బంగారు నగలు, పెళ్లి కోసం తీసుకున్న బట్టలు సైతం కనిపించలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరవింద్‌కు రుచి ఫోన్‌ చేసి తన కోసం వెతకొద్దని చెప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్‌.. గుండెపోటుతో మృతి

మరిన్ని వార్తలు