వచ్చే దశాబ్దం మనదే...

7 Jul, 2022 19:26 IST|Sakshi

సాంకేతిక రంగంలో ప్రస్తుత వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా, వచ్చే దశాబ్దం భారతదేశానిదేనని  కూ యాప్‌ సీఈఓ  సహ వ్యవస్థాపకుడు అప్రమయ రాధాకృష్ణ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డిజిటల్‌ ఇండియా వీక్‌లో భాగంగా టెక్నాలజీ  ఇండియా అండ్‌ ది వరల్డ్‌ అనే అంశంపై ’క్యాటలైజింగ్‌ న్యూ ఇండియా టేక్డ్‌’ అనే అంశంపై సదస్సులో కూ యాప్‌ సీఈఓ అప్రమయ రాధాకృష్ణ  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీషు మాట్లాడలేని ప్రతీ ఒక్కరి భావప్రకటనా స్వేచ్ఛ అనే కల సాకారం కోసం ప్రారంభమైన తమ స్టార్టప్‌ అంతకంతకూ పురోగమిస్తోందన్నారు. భారతదేశపు ప్రప్రధమ బహుభాషా మైక్రో–బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌  కూ ప్రస్తుతం వినూత్నమైన కొత్త ఫీచర్లతో సోషల్‌ మీడియా దిగ్గజాలకు సవాలు విసురుతోందని, నైజీరియాలో సైతం ఉపయోగించబడుతోందనీ వివరించారు.భవిష్యత్తులో ప్రపంచంలోని ఇతర దేశాలకూ కూ విస్తరించనుందన్నారు. 

భారత ప్రభుత్వం నిర్వహించిన ఈ డిజిటల్‌ ఇండియా వీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గత సోమవారం ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమంలో స్టార్టప్‌ సదస్సు నిర్వహించారు. ఇందులో, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెక్‌ స్టార్టప్‌లు పాల్గొని, ప్రధాని మోదీ కలలుగన్న డిజిటల్‌ ఇండియాకు అనుగుణంగా తమ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.   ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన అనంతరం కూ సిఇఓ తన సంతోషాన్ని కూ వేదికగా పంచుకున్నారు. ఇదో అద్భుతమైన అవకాశమని పాల్గొన్నవారిలో సానుకూల ధృక్పధం కనిపించిందని అన్నారు.

మరిన్ని వార్తలు