రైతు నిరసనలు; ఉచితంగా ఫుట్ మసాజ్ సెంటర్లు, భోజనం
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ రాజధాని ప్రాంతంలోని సింగు సరిహద్దు వద్ద నిరసనలు చేస్తున్న రైతులకు శుక్రవారం ఇంటర్నేషనల్ ఎన్జీవో ఖాల్సా మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ‘సింగూ సరిహద్దు వద్ద నిరసన చేస్తూ అలసిపోయిన వృద్ద రైతుల కోసం మా వంతు భాద్యతగా వారి కోసం ఫుట్ మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేశాము’ అని ఖాల్సా మేనేజింగ్ డైరెక్టర్ అమర్ప్రీత్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనితోపాటు 400 వాటర్ప్రూఫ్ టెంటులు, గ్లిసరిన్ సదుపాయం గల బాత్రూంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: సుప్రీం మెట్లెక్కిన రైతులు
వాలంటీర్ తేజిందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ... ‘మొదటి రోజు నుంచి అందరికీ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నాం. ఢీల్లీలో భీకరమైన చలినుంచి రక్షించడానికి కావాల్సిన దుప్పట్లను రైతులకు సరఫరా చేయడం కోసం 10 ట్రక్కులు ఉపయోగించమని వివరించారు. చాలా దూరం నుంచి ప్రయాణించి అలసిపోయిన రైతులకు ఫుట్ మసాజ్లు ఉపశమనం కలిగిస్తున్నాయి. మొదటి రోజు 500 మంది రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. అన్నదాతలకు ఇలాంటి సేవలు అందిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు’. అని తెలిపారు.
దీనిపై రైతులు స్పందిస్తూ.. చాలా దురం నుంచి ప్రయాణం చేసి దేశ రాజధానికి వచ్చిన తమకు ఫుట్ మసాజ్ సెంటర్ సదుపాయాన్ని వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిరసనలతో పోరాడుతున్న వారికి ఈ అవకాశం కల్పించడం ఉపశమనంగా భావిస్తున్నామన్నారు. గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ తోమర్ రైతులను ఆందోళలనుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులతో చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు. కాగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. మూడు కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ భాను(బీకేయూబీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.