గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఎన్‌జీటీ నిర్ణయం

9 Nov, 2020 13:05 IST|Sakshi

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నేటి అర్థరాత్రి నుంచి నిషేధం అమల్లోకి

న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్‌ 9(సోమవారం) అర్థరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌(ఎన్‌జీటీ) పూర్తి నిషేధం విధించింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఉత్తర్వు నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్‌లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది.

అలానే గాలి నాణ్యత మోడరేట్‌గా ఉన్న నగరాలు, పట్టణాల్లో​ తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్‌ క్రాకర్స్‌ని మాత్రమే అనుమతించింది. అది కూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది.  దీపావళి, గురుపూర్‌లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్‌లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది.(చదవండి: బాణాసంచా బ్యాన్‌పై కర్ణాటక యూటర్న్‌)

ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్‌ క్రాకర్స్‌ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. "కోవిడ్ -19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్‌జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో.. గాలి నాణ్యత అధ్వన్నంగా ఉన్న తరుణంలో.. కాలుష్యాన్ని మరింత పెంచే బాణాసంచా వాడకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన ఎన్‌జీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ కాలంలో వాయు కాలుష్యం కారణంగా రోజుకు 15,000 కేసులు నమోదవుతాయని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలు చేసిన హెచ్చరికలను గుర్తు చేసింది.  ప్రస్తుతం ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 7,745 కేసులు నమోదయ్యాయి. (అలర్ట్‌ : కరోనాకు కాలుష్యం తోడైతే.. )

ఏటా, ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని  ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్‌ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది.

మరిన్ని వార్తలు