భారీ నిధులతో రహదారుల అభివృద్ధి

12 Aug, 2020 16:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 22 ఎక్స్‌ప్రెస్‌ వేలను నిర్మించే భారీ ప్రణాళికను జాతీయ రహదారుల అథీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్సెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీ)లను ఏర్పాటు చేయాలని కూడా ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈ మెగా ప్లాన్‌లో భాగంగా తొలుత ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కోసం తొలి ఎస్‌పీవీకి ఎన్‌హెచ్‌ఏఐ బోర్డు ఆమోదముద్ర వేసింది.  పూర్తిగా హైవేస్‌ అథారిటీ భాగస్వామ్యంతో ఈ ఎస్‌పీవీ ఏర్పాటైందని అధికారులు తెలిపారు.

ఎన్‌హెచ్‌ఏఐ స్వతంత్ర సంస్థ కావడంతో ఎస్‌పీవీకి బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు, బీమా సంస్ధలు, పెన్షన్‌ నిధుల నుంచి రుణాలు పొందడం సులభతరం కానుంది. కాగా, రూ 45,000 కోట్ల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం ఏర్పాటైన తొలి ఎస్‌పీవీలో ఎన్‌హెచ్‌ఏఐ రూ 5000 కోట్లు వెచ్చిస్తుండగా, మిగిలిన 40,000 కోట్లను రుణ మార్కెట్‌ నుంచి సమీకరించనున్నారు. భారత మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పెన్షన్‌ నిధుల సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు సైతం ఆసక్తికనబరుస్తున్నారని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు పేర్కొన్నాయి.

చదవండి : ఆ రోడ్డు ఖర్చు భరించలేం : ఢిల్లీ ప్రభుత్వం

మరిన్ని వార్తలు