యూపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

30 Sep, 2020 19:44 IST|Sakshi

బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో యువతిపై హత్యాచార ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ నాలుగు వారాల్లోగా యూపీ ప్రభుత్వ యంత్రాంగం దీనిపై బదులివ్వాలని కోరింది. బాధిత బాలిక కుటుంబానికి, సాక్షులకు సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనే పరిస్ధితుల నేపథ్యంలో బాధిత మహిళ కుటుంబానికి హాని జరగకుండా చర్యలు చేపట్టాలని కోరింది. నిందితులకు ఎలాంటి జాప్యం లేకుండా శిక్ష పడేలా విచారణను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఈ అంశంపై చొరవ చూపాలని యూపీ డీజీపీని కమిషన్‌ కోరింది. చదవండి : హత్రాస్‌ హారర్‌ : యోగి రాజీనామాకు ప్రియాంక డిమాండ్‌

కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కోరారు. మరోవైపు హత్రాస్‌ హత్యాచార ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు