‘ప్రధానమంత్రి ప్రాణాలకు ముప్పు’

3 Sep, 2020 20:42 IST|Sakshi

ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు ఈమెయిల్‌ రావడం కలకలం రేపింది. మోదీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని ఓ జాతీయ వార్తా ఛానెల్‌ వెల్లడించింది. ఓ ఈమెయిల్‌ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్‌ఐఏ వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్ట్‌ 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. చదవండి : పీఎం కేర్స్‌కు తొలి విరాళం మోదీనే

బెదిరింపు మెయిల్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్‌ఐఏ లేఖ ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధానికి భద్రతను కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) దృష్టికి తీసుకువెళ్లింది. బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేపట్టేందుకు రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్‌ఐఏ రంగంలోకి దించింది.అసలు ఈమెయిల్‌ ఎక్కడినుంచి వచ్చిందో రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు