భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ

19 Sep, 2020 09:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసింది. ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!)

కాగా శుక్రవారం నాడు కశ్మీర్‌లోని గుడీకల్‌ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు.

మరిన్ని వార్తలు