ఎన్‌ఐఏ విచారణలో సంచలన విషయాలు వెల్లడి

13 Oct, 2020 09:07 IST|Sakshi

బెంగళూరు / బనశంకరి: దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్‌లో అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి సిరియాలో ఉగ్ర శిక్షణ తీసుకున్న ఐదుగురు ఐసిస్‌ ఉగ్రవాదులు బెంగళూరులో తిష్టవేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నగర వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: వీవీ అల్లుడికి ఎన్‌ఐఏ నోటీసులు)

ఆ ఏడుగురు ఎక్కడ..
గతనెలలో అరెస్ట్‌ అయిన నగరంలోని ఎంఎస్‌.రామయ్య ఆసుపత్రిలో డాక్టరుగా ఉన్న బసవనగుడి నివాసి అనుమానిత ఐసీస్‌ ఉగ్రవాది డాక్టర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఇచ్చిన సమాచారంతో గుర్రప్పనపాళ్యలోని బిస్మిల్లానగరలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీ చేపట్టగా ఏడుగురు యువకులు కొంతకాలంగా కనిపించలేదని తేలింది. వీరంతా సౌదీ అరేబియా ద్వారా ఇరాన్‌ సరిహద్దుకు చేరుకుని అక్కడి నుంచి సిరియాకు వెళ్లినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ‘మేకింగ్‌ ఆఫ్‌ ఫ్యూచర్’‌ అనే వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్డులోని ఓ ఇంట్లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించినట్లు సమాచారం. ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన డాక్టర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. చదువుకున్న యువతను ఐసీస్‌లో చేర్చుకొని శిక్షణ ఇచ్చేందుకు ఇక్బాల్‌ జమీర్, అబ్దుల్‌ రెహమాన్‌ బ్యాంకు ఖాతాలకు భారీగా నగదు జమ అయినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు