మధురైలో ఎన్‌ఐఏ సోదాల కలకలం 

18 May, 2021 10:59 IST|Sakshi

తీవ్రవాద మద్దతుదారుల ఇళ్లలో తనిఖీలు 

పెన్‌డ్రైవ్, సిమ్‌కార్డు, డాక్యుమెంట్లు స్వాధీనం

సాక్షి ప్రతినిధి, చెన్నై: కేరళ నుంచి వచ్చిన నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు మధురైలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు తీవ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీలంక చర్చిలో మూడేళ్ల క్రితం జరిగిన మారణహోమంలో తమిళనాడుకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని భారత్‌కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు లోతుగా విచారణ చేపట్టగా తమిళనాడు పాత్రను గుర్తించారు. అనాటి నుంచి తమిళనాడులోని అనుమానితులపై నిఘాపెట్టారు. ఫేస్‌బుక్‌లో సందేహాస్పద పోస్టింగ్‌లను గమనించిన మధురై పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్‌ అలియాస్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానించి గతంలో కేసు పెట్టారు.

ఈ కేసు ఏప్రిల్‌లో ఎన్‌ఐఏకు బదిలీకాగానే ఇక్బాల్‌ను అరెస్ట్‌ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, కేరళ నుంచి వచ్చిన ఎన్‌ఐఏ అధికారుల బృందం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  మధురై కాజీమర్‌ వీధి, కే పుత్తూరు, పెత్తానియాపురం, మగప్పాళయం తదితర ప్రాంతాల్లో ఇక్బాల్‌ అతని స్నేహితుల ఇళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు తనీఖీలు సాగాయి. ఇక్బాల్‌ ఇంటి నుంచి పెన్‌ డ్రైవ్, సిమ్‌కార్డు సహా 16 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక తిరుప్పూరుకు చెందిన ఒక యువకుడు ఇక్బాల్‌తో ఎక్కువసేపు వాట్సాప్‌లో చాటింగ్‌ చేసిన విషయం బయటపడింది. సుమారు 8 గంటలపాటూ ఆ యువకుడిని విచారించి విడిచిపెట్టారు.

(చదవండి: Covid-19: తలైవా విరాళం రూ. 50 లక్షలు)

మరిన్ని వార్తలు