ఉద్ధవ్‌కు మరో షాక్‌.. షిండేను కలిసిన సోదరుడి కుమారుడు

30 Jul, 2022 10:07 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్ధవ్‌ థాక్రేకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కీలక నేతలతో పాటు కుటుంబ సభ్యుల్లోనూ కొందరు షిండే వర్గానికి మద్దతు తెలుపుతుండటం ఉద్ధవ్‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా మరో షాక్‌ తగిలింది. బాల్‌థాక్రే మనుమడు, ఉద్ధవ్‌ థాక్రే సోదరుడి కుమారుడు నిహార్‌ థాక్రే.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కలిశారు. వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిహార్‌ థాక్రేకు ఇప్పటి వరకు రాజకీయంగా అనుభవం లేకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో షిండేను కలవటం హాట్‌టాపిక్‌గా మారింది.

బాల్‌ థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్‌ థాక్రే కుమారుడే నిహార్‌ థాక్రే. బిందుమాధవ్‌.. 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన సినీ నిర్మాతగా ఉండగా.. రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే.. ఆయన కుమారుడు నిహార్‌.. తాజాగా షిండేను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ఉద్ధవ్‌ మరో సోదరుడు జైదేవ్‌ థాక్రే మాజీ భార్యా స్మితా థాక్రే సైతం ఇటీవలే సీఎం షిండేను కలిశారు. నిహార్‌ థాక్రే ఒక న్యాయవాది. ఆయన బీజేపీ నేత హర్షవర్ధన్‌ పాటిల్‌ కుమార్తె అంకితా పాటిల్‌ను గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్‌ పాటిల్‌ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మంత్రిగానూ సేవలందించారు. వలసలు పెరిగిన క్రమంలో షిండేపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్ధవ్‌ థాక్రే. తాను అనారోగ్యానికి గురైనప్పుడు కుట్రలు పన్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!

మరిన్ని వార్తలు