టోల్‌ గేట్ల ధరలపై నితిన్‌ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు

16 Sep, 2021 18:02 IST|Sakshi
సోహ్నలో పనులు పరిశీలిస్తున్న మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం ఖట్టర్‌

మంచి రోడ్లు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే?

హరియాణా పర్యటనలో వ్యాఖ్యలు

సాక్షి, చండీగఢ్‌: కేంద్ర మంత్రులు పలు సమస్యలపై ప్రశ్నిస్తే వింతగా సమాధానమిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌, స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. టోల్‌ గేట్ల ధరల పెంపుపై ప్రశ్నించగా వింతగా సమాధానమిచ్చారు. ‘డబ్బులు చెల్లిస్తే మంచి రోడ్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. దానికో ఉదాహరణ కూడా వివరించి సోషల్‌ మీడియాలో నెటిజన్లకు చిక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకోండి. 
చదవండి: 2023లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం

హరియాణాలోని సోహ్నాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (డీఎంఈ) పనులను గురువారం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసీ హాల్‌లో వివాహం చేసుకుంటే డబ్బులు చెల్లించాలి. అదే మైదానంలో అయితే ఏం ఖర్చు ఉండదు. అక్కడ కూడా చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై టోల్‌ చార్జీలతో ప్రయాణ వ్యయం పెరుగుతుండడంపై ఆయన ఇచ్చిన ఉదాహరణ. అంతటితో ఆగకుండా మరికొంత ఉదాహరిస్తూ..

‘ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే వినియోగిస్తే 12 గంటల్లో ప్రయాణించొచ్చు. ఎక్స్‌ప్రెస్‌ వేతో ప్రమాణ సమయం తగ్గుతుంది. ఇంధన ధర తగ్గుతుంది. అదే ఓ ట్రక్కు ముంబై నుంచి ఢిల్లీ చేరడానికి 48 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్‌ వేతో ఎక్కువ ట్రిప్పులు తిరగొచ్చు. దాని ద్వారా వ్యాపారం మరింత చేసుకోవచ్చు’ అని తెలిపారు. మెరుగైన రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించక తప్పదని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.
చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్‌

దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌ వేను ఢిల్లీ- ముంబై మధ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న 1,380 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌ వే పనులు 2023లో పూర్తి చేయాలనే లక్ష్యం. ఆ పనులు ముమ్మరం చేయడంలో భాగంగా నితిన్‌ గడ్కరీ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో కలిసి పరిశీలించారు. భవిష్యత్‌లో రోడ్లపై విమానాలు దిగే మాదిరి అత్యంత నాణ్యతతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు