10 లక్షల ఉద్యోగాలు బోగస్‌: నితీష్‌

30 Oct, 2020 16:02 IST|Sakshi

పట్నా: ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. తన ప్రత్యర్థి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌పై మరోసారి పదునైన బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్‌జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. మహాకూటమి తరపున ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. తేజస్వియాదవ్‌ 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట కేవలం బోగస్‌ అని నితీశ్‌ కుమార్‌ విమర్శించారు. శుక్రవారం పర్భట్టాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 

15 ఏళ్లపాటు లాలూప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవి  ముఖ్యమంత్రులుగా పనిచేశారని, అప్పుడు బిహార్‌ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని నితీష్‌ కుమార్‌ విమర్శలు కురిపించారు. వారి హయాంలో కేవలం 95,000 ఉద్యోగాలు‌ మాత్రమే ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ఆర్జేడీ చెప్పేదంతా బోగస్‌ మాటలేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి కూడా నాలుగు లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు, 15లక్షల ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చింది. 

ఈ విషయాన్ని ఐదోసారి బిహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న నితీశ్ ‌కుమార్‌ మర్చిపోయారేమో అని కొంత మంది రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో బిహార్‌ ఎ‍న్నికల్లో ఉద్యోగ ప్రకటన కీలక పాత్ర పోషించనుంది. ఇక  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు నవంబర్‌10వ తేదీన వెలువడనున్నాయి.  చదవండిప్రచార పర్వం : వేదిక కూలడంతో కిందపడిన కాంగ్రెస్‌ అభ్యర్థి

మరిన్ని వార్తలు