ఐపీఎస్‌ బలవంతపు క్వారంటైన్‌పై సీఎం నితీశ్ స్పందన

3 Aug, 2020 14:26 IST|Sakshi

పట్నా: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసును విచారించడానికి వెళ్లిన బిహార్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ వినయ్‌ తివారీని క్వారంటైన్‌లో ఉండాలని ముంబాయి హెల్త్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఆదేశించడంపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్పందించారు. కేసును విచారించడానికి వెళ్లిన పోలీసు అధికారిని ఇలా బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచడం సరైనది కాదని అన్నారు.  బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే వినయ్‌ తివారీని బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచారు అని  ట్వీట్‌ చేసిన అనంతరం నితీశ్‌ కుమార్‌ స్పందించారు. ఆదివారం సుశాంత్‌ కేసు విచారణలో బిహార్‌, ముంబై పోలీసులకు మధ్యలో వాగ్వాదం జరిగింది. డీజీపీ ఈ విషయం పై ముంబై పోలీసులతో మాట్లాడారు. వినయ్‌ విషయంలో జరిగింది సరైనది కాదు అని వారికి తెలిపారు అని నితీశ్‌ కుమార్‌ చెప్పారు. 

ఇది రాజకీయ విషయం  కాదని, న్యాయానికి సంబంధించింది అని బిహార్‌ పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారు అని పేర్కొన్నారు. తివారీ చేతి మీద క్వారంటైన్‌ స్టాంప్‌ వేసిన 40 నిమిషాల నిడివిగల వీడియోను బిహార్‌ పోలీసులు షేర్‌ చేశారు. ముంబైలో కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారందరికి క్వారంటైన్‌ విధిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. రేఖా చక్రవర్తి, ఆమెకుటుంబ సభ్యులపై సుశాంత్‌ రాజ్‌పుత్‌ నాన్న ఫిర్యాదు చేసిన తరువాత నుంచి ముంబై పోలీసులతో పాటు పట్నాకు చెందిన నలుగురు పోలీసుల బృందం కూడా విచారణ మొదలు పెట్టింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14వ తేదీన బాంద్రాలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఆయన ఆత్మహత్యకు సంబంధించి  చాలా కథనాలు బయటకు వస్తున్నాయి.

చదవండి:  సుశాంత్‌ సూసైడ్‌: సీఎం వ్యాఖ్యలు కలకలం 

మరిన్ని వార్తలు