మరో కొత్త వేరియంట్‌.. వాటితో పోలిస్తే మహా డేంజర్‌..!

8 Jun, 2021 16:26 IST|Sakshi

సాక్షి, పుణె: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా  వైరస్‌ మ్యుటేషన్‌ చెందడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ముఖ్యకారణమని పరిశోధకులు తెలిపారు.  డెల్టా వేరియంట్‌గా పిలవబడే B.1.617.2 వేరియంట్‌ భారత్‌లో అత్యధిక ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం భారత్‌లో మరో కరోనా వైరస్‌ వేరియంట్‌ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) గుర్తించారు. ఈ వేరియంట్‌ను  అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల నుంచి B.1.1.28.2 వేరియంట్‌గా గుర్తించారు.

ఎన్‌ఐవి నివేదిక ప్రకారం, బ్రెజిల్‌, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి  భారత్‌కు  వచ్చిన ప్రయాణికుల్లో కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన దుష్ప్రభావాలను  కలిగించే అవకాశం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేరియంట్‌తో వైరస్‌ వ్యాప్తి మరింత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్‌ ప్రస్తుతం ఉన్న టీకాలు ఎంతమేరకు  సామర్థ్యాన్ని కల్టి ఉన్నాయనే విషయం కోసం , ఎక్కువగా పరీక్షించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కొత్త వేరియంట్‌ను ప్రయోగించిన ఎలుకల్లో శరీర బరువు ఒక్క సారిగా తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా శ్వాసకోశంలో సమస్యలు, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడాయని పేర్కొన్నారు.

కాగా, పది  ప్రయోగశాలల సమూహమైన ఇన్సాకాగ్‌ (INSACOG)  విస్తృత అధ్యయనం ప్రకారం, గత రెండు నెలల్లో భారత్‌లో కోవిడ్ -19 కేసుల పెరుగుదల SARS-CoV-2 కు చెందిన  B.1.617 వేరియంట్ కారణమని తెలిపారు. ఇన్సకాగ్‌ ప్రకారం కరోనా వైరస్‌ B.1.1.7 వేరియంట్‌కు 'ఆల్ఫా' అని పేరు పెట్టారు. దీనిని మొదటిసారిగా యునైటెడ్‌ కింగ్‌ డమ్‌లో గుర్తించారు. ఈ వేరియంట్‌ గత ఒకటిన్నర నెలల్లో తీవ్రస్థాయిలో విజృంభించిందని ఇన్సాకాగ్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు