కరోనా థర్డ్‌వేవ్‌: అందుకు తగిన ఆధారాల్లేవు

26 May, 2021 02:13 IST|Sakshi

కోవిడ్‌ వేవ్‌పై ఎన్‌టీఏజీఐ చైర్మన్‌ ఎన్‌కే అరోరా స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కోవిడ్‌ తర్వాతి వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కోవిడ్‌–19 వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా ప్రకటించారు. ‘దేశంలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌ స్ట్రెయిన్స్‌ ఏవీ కూడా యువతపైనో, చిన్నారులపైనో ప్రత్యేకంగా ప్రభావం చూపేవి కావని డేటా చెబుతోంది. అయితే, ఈ రెండు గ్రూపుల్లో బాధితుల సంఖ్య మాత్రం పెరుగు తోం ది’ అని వివరించారు. దేశంలో థర్డ్‌ వేవ్‌ వస్తుందని ఇప్పటికిప్పుడే చెప్పడం సాధ్యం కాదన్నారు.

‘మన దేశంతోపాటు, ఇతర దేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే.. తర్వాతి వేవ్‌లోగానీ, రానున్న వారాలు, నెలల్లో గానీ చిన్నారులే ఎక్కువ కోవిడ్‌ బారిన పడతారని భావించేందుకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదు’ అని అరోరా వెల్లడించారు. పీడియాట్రిక్‌ కోవిడ్‌ సేవలను మెరుగు పరిచేందుకు అదనపు వనరులను సమకూర్చు కోవాలన్నారు. ‘నవజాత శిశువులు, చిన్నారులు, గర్భిణిలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అవసరమవుతాయి. పదేళ్లలోపు పిల్లలకు తల్లి, తండ్రి, లేదా సంరక్షకులు కావాలి. కోవిడ్‌ బారిన పడే గర్భిణి నెలలు నిండకుండా ప్రసవించే ప్రమాదముంటుంది. ఈ ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, చికిత్స విధానాలను, ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై సూచనలను సిద్ధం చేశాం’ అని ఆయన తెలిపారు. 

చదవండి: (కరోనా మృతుల ముక్కు, గొంతులో.. 24 గంటల్లో వైరస్‌ నిర్వీర్యం)

మరిన్ని వార్తలు