బడ్జెట్‌ సమావేశాలు: 74 ఏళ్లలో ఇదే ప్రథమం..

11 Jan, 2021 18:35 IST|Sakshi

న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌గా ఉండనుండటం మాత్రం ఖాయం. అవును మరి కోవిడ్ దేశ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్‌ కేటాయింపులతో బూస్ట్‌ ఇస్తారా.. లేక మరింత డీలా పడేలా చేస్తారానే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ రూపం, కేటాయింపులు సరికొత్తగా ఉండనుండటం మాత్రం వాస్తవం. ఈ సారి ప్రారంభం కానున్న బడ్జెట్‌ ప్రక్రియ దాదాపు 70 ఏళ్ల సంప్రదాయనికి ముగింపు పలకనుంది. అవును బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభైన 74 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది బడ్జెట్‌ కాపీలను ప్రింట్‌ చేయడం లేదు. నవంబర్ 26, 1947 తరువాత మొదటిసారి ఈ ఏడాది బడ్జెట్‌ కాపీల ప్రింటింగ్‌ని నిలిపివేయనున్నారు. నార్త్‌ బ్లాక్‌లోని ఇళ్లని బడ్జెట్‌ ప్రింటింగ్‌ కోసం వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఇక డాక్యుమెంట్‌లు ముద్రించి, సీల్‌ చేసి.. బయటకు పంపే వరకు అధికారులంతా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఇక్కడే ఉంటారు. (చదవండి: ఈ దఫా ‘నెవ్వర్‌ బిఫోర్‌’ బడ్జెట్)

అయితే ప్రస్తుతం కోవిడ్‌-19 భయాలు.. కొత్త స్ట్రెయిన్‌‌ కలకలంతో బడ్జెట్‌ కాపీలను ప్రింట్‌ చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రతి ఏటా బడ్జెట్‌ కాపీ ప్రింటింగ్‌ సమయంలో నిర్వహించే హల్వా వేడుకకు కూడా ఈ ఏడాది బ్రేక్‌ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ కాపీలను డిజిటల్‌ రూపంలో అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్‌, ఎకానమిక్‌ సర్వే డిజిటల్‌ కాపీలను అందించనున్నారు. కరోనా మూలంగా 2020-2021 ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో పేపర్‌లెస్‌ బడ్జెట్‌ సమావేశాలు ఒకటి. రికార్డులను డిజిటలైజ్‌ చేయాలని పార్లమెంట్‌ ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇక కరోనా మూలంగా అది ఆచరణ సాధ్యం అయ్యింది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్‌ చేస్తే బాగుంటుందని అధికారలు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు