ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే
సాక్షి, ముంబై: రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాకపోవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న మాట వాస్తవమేనని, కరోనా చైన్ను తెంపేందుకు లాక్డౌన్ పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ విధిస్తే ఆర్థికంగా నష్టం వాటిళ్లుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాకు టీకా ఎప్పుడు వస్తుందనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. టీకా వచ్చినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదు.. మనమందరం అప్రమత్తంగా ఉంటూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై మనం విజయం సాధించాలని, నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆంక్షలను కఠినతరం చేస్తామని చెప్పారు.
చదవండి: (స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..)