కరోనా సెకండ్‌ వేవ్‌ ఉంది.. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోలేదు

25 Nov, 2020 08:35 IST|Sakshi

ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే 

సాక్షి, ముంబై: రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ విషయంపై నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు లేవన్నారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో ప్రజలందరు ప్రభుత్వం సూచించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.   ('మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటాం')

సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని, అనవసరంగా రద్దీగా ఉండే మార్కెట్ల వంటి ప్రదేశాల్లో తిరిగి ఇంకా రద్దీని పెంచవద్దని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వం కచ్చితంగా కొన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దేశంలోని ఢిల్లీ, గోవా, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో కూడా దీపావళి తర్వాత స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌ ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.   (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!)

మరిన్ని వార్తలు